14, మార్చి 2023, మంగళవారం

విద్యాశాఖలో సంక్షోభం తొలగేదెన్నడు?

విద్యాశాఖలో సంక్షోభం తొలగేదెన్నడు? 

        లెక్కకు మిక్కిలి ఉపాధ్యాయ ఖాళీలతో విద్యాశాఖలో తీవ్రమైన సంక్షోభం నెలకొన్నది. న్యాయ వివాదాల పేరుతో ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను పట్టించుకోకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించాలి. పదిహేడేండ్లుగా పర్యవేక్షణ అధికారుల భర్తీ లేదు. ఎనిమిదేండ్లుగా పదోన్నతులు, ఐదేండ్లుగా బదిలీలు లేవు. డీఈఓ, డిప్యూటీ ఇఓ, ఎంఈఓ, డైట్‌, బీఈడీ కళాశాల అధ్యాపక పోస్టులు 95శాతం ఖాళీగా ఉన్నాయి. 2000 పైగా ఉన్నత పాఠశాల గెజిటెడ్‌ ప్రధానో పాధ్యాయులు, 7200 స్కూల్‌ అసిస్టెంట్‌, 2100 ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యా యుల పోస్టులు, 1000 పైగా మోడల్‌ స్కూల్‌ టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల (పిఓ-2018) ప్రకారం సర్వీసు నిబంధనలపై వివాదం సమసిపోతుందని, సంక్షోభం పరిష్కారం అవుతుందని ఆశించాం. పీఓ - 2018పైన కూడా న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తాయిలంగా వినియోగించుకుంటున్న పండిట్‌, పీఈటీల అప్గ్రేడేషన్‌పై న్యాయ వివాదం అపరిష్కృతంగానే ఉంది. పండితులు, పీఈటీల అప్గ్రేడేషన్‌ పై కొన్ని సంఘాల అవకాశవాద, ద్వంద్వ వైఖరే ఈ సంక్షోభానికి కారణం. కనీసం ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీలను యాజమాన్యం వారీగానైనా ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తే పాఠశాలల్లో సబ్జక్టు టీచర్ల కొరత తీరుతుందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని భావించాం. మూడేండ్లుగా ఉపాధ్యాయ సంఘాల పోరాటకమిటీ (యుయస్పీసీ), జాక్టో ఆధ్వర్యంలో ఐక్య పోరాటాలు నిర్వహించాం. అన్ని శాఖల్లో పదోన్నతులు ఇచ్చారు కానీ ఉపాధ్యాయులకు మాత్రం ఇవ్వలేదు సరికదా... యుయస్పీసీ, జాక్టో నాయకులపై క్రిమినల్‌ కేసు పెట్టి నెలకు రెండు వాయిదాలతో కోర్టుచట్టూ తిప్పుతున్నారు.

    పీఓ-2018కి అనుగుణంగా నూతన క్యాడర్లలో ఉపాధ్యాయుల కేటాయింపు అనంతరం పదోన్నతులు వస్తాయని ఆశించాం. ప్రభుత్వం ఏకపక్షంగా జీఓ 317ను విడుదల చేసి, అభ్యంతరాలను బుల్డోజ్‌ చేస్తూ ఉపాధ్యాయుల శాశ్వత కేటాయింపు పూర్తి చేశామనిపించింది. నష్టపోయిన ఉపాధ్యా యులు వేలాదిగా హైకోర్టులో కేసులు వేశారు. గత సంవత్సర కాలంగా యుయస్పీసీ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళన, పోరాటాలు నిర్వహించిన తరువాత తప్పని పరిస్థితుల్లో జనవరి 15న విద్యామంత్రి, ఆర్థిక మంత్రి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి యాజమాన్యం వారీగా బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ విరామం తరువాత బదిలీలు, పదోన్నతులు నిర్వహిస్తున్నందున ప్రక్రియ సజావుగా సాగేటందుకు ఉపాధ్యాయులు, సంఘాలు సహకరించాలని మంత్రులు కోరారు. అందుకు సంఘాలూ సంసిద్ధత వ్యక్తం చేశాయి. బదిలీ నిబంధనలపై అధికారులతో జరిగిన చర్చల్లో ఉపాధ్యాయులు అందరికీ బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం (జీరో సర్వీస్‌ బదిలీలు) ఇవ్వాలని, జిల్లాల పరిధి తగ్గినందున స్పెషల్‌ కేటగిరీ పాయింట్లు ఐదుకు తగ్గించాలని యుయస్పీసీ పక్షాన చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఉంటే బదిలీలపై న్యాయ వివాదాలు వచ్చి ఉండేవి కాదు. తీవ్ర నిరసనలతో అట్టుడికిన ఉద్యోగుల శాశ్వత కేటాయింపు నిబంధనల జీఓ 317పై న్యాయస్థానంలో స్టే రాకుండా శ్రద్దచూపిన ప్రభుత్వం గత పాతికేండ్లుగా అమలు జరుగుతున్న కౌన్సెలింగ్‌ నిబంధనల జీఓపై స్టే రాకుండా అడ్డుకోలేక పోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కక్షిదారులకు న్యాయం జరగాలని కోరుకోవటం సమంజసమే, కానీ ఎట్టిపరిస్థితుల్లోనైనా ప్రక్రియను ఆపాలనే లక్ష్యంతో ఏండ్ల తరబడి కొట్లాడుతున్న ఉపాధ్యాయుల ఉమ్మడి ప్రయోజనా లకు వ్యతిరేకంగా రాజ్యాంగ పరమైన మౌలిక అంశాలను లేవనెత్తి వివాదాస్పదం చేయటమే విషాదం.

    గురుకుల విద్యాసంస్థలు, మోడల్‌ స్కూల్స్‌ సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నందున రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు నిర్బంధం కాదు. అయినా నిర్వహించ బూనుకు న్నప్పుడు ఉద్యోగుల విభజనలో గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని వివాదరహితంగా రీ అలైన్‌మెంట్‌ ప్రక్రియను అమలు చేసి ఉండాల్సింది. లేనందున ప్రభావిత మైన ఉపాధ్యాయులు హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు రీ అలైన్‌మెంట్‌పై హైకోర్టులో కేసు పరిష్కారం అయితే గానీ ఆయా విద్యాసంస్థల్లో బదిలీలు, పదోన్నతులు చేపట్టే పరిస్థితి లేదు.

    సుప్రీం కోర్టు, హైకోర్టులో ఉన్న న్యాయ వివాదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపాలి. పర్యవేక్షణ అధికారుల పోస్టులతో సహా వేసవిలో అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలి. తద్వారా ఏర్పడిన ఖాళీలకు ప్రత్యక్ష నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చి సత్వరమే భర్తీ చేయాలి. వచ్చే విద్యా సంవత్సరం సజావుగా సాగేటందుకు చర్యలు తీసుకోవాలి. పేద పిల్లలు అధికంగా చదివే ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణ అధికారులు, ఉపాధ్యాయుల కొరత తీర్చటాని న్యాయస్థానాలు సైతం సానుకూల దృక్పథంతో న్యాయ వివాదాల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.

- చావ రవి